
(బి.మదన్ మోహన్ రెడ్డి,మనఛానల్ న్యూస్ స్పెషల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ)
దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు,పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి గురువారం సిఐఎఫ్ఏ సెక్రటరీ జనరల్ బి.మదన్ మోహన్ రెడ్డి తమ సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశంలోని రైతులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారన్నారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్,విదర్భ,బుందేల్ఖండ్,ఉత్తర కర్ణాటక,రాజస్ధాన్ల్లో మంజూరైన సాగునీటి ప్రాజెక్టులు గత 20 సంవత్సరాలుగా పూర్తి కాలేదన్నారు.వీటి అన్నింటినీ ఎకకాలం పూర్తి చేసి రైతులకు మేలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
అదేవిధంగా మామిడి ఎగుమతులతోపాటు వేరుశనగ,ప్రొద్దుతిరుగుడు,ఆముదాలు తదితర నూనె గింజల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.ఇక చిరుధాన్యాలకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ప్రభుత్వం కనీస మద్ధతు ధర ప్రకటించాలన్నారు.రైతన్నలు నష్టపోకుండా పంటల బీమాలను ప్రభుత్వం భరించే ప్రకృతి వైఫరీత్యాల సమయంలో పంటకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవా లన్నారు.ప్రతి రైతుకు వ్యక్తిగత ఇన్సూరెన్స్తోపాటు వ్యక్తిగత రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని ప్రభుత్వుం కల్పించాలన్నారు.
దేశంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు
- కాలువ కింద సాగునీటి నిర్వహణ సామర్ధ్యం పెంచాలి
- శాశ్వత సాగునీటి విధానాల పరిష్కార ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి,కరువు పీడిత ప్రాంతాల ప్రాధాన్యంగా నదీజలాల పున:పంపిణీ జరపాలి
- నూనె,పప్పు దినుసులు పండించే రైతులకు ప్రోత్సాహం అందించాలి
- పంటల్లో కనీస మద్ధతు ధర నిర్ణయించడంతోపాటు భూమి కౌలును కూడా ప్రభుత్వం భరించాలి
- ప్రధానమంత్రి ఫసల్ బీమా నిర్వహణలో సమూలమైన మార్పు చేయాలి.పంట నష్టపరిహారం ప్రతి రైతు పొలం ఆధారంగా చేపట్టాలి
- కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి
- సమగ్ర ఎగుమతి,దిగుమతి విధానాలు చేపట్టాలి
- వ్యవసాయంతోపాటు,పశువులు,కోళ్లు,గొర్రెలు,చేపలు తదితర అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి
- వ్యవసాయ పరికరాలు,ఎరువులు,పురుగుల మందులు,ట్రాక్టర్లు,డ్రిప్,స్పింక్లర్లు తదితరాలపై జీఎస్ఆర్ తొలగించాలి

