
మనఛానల్ న్యూస్ – బిజినెస్ డెస్క్
ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) త్రైమాసిక ఫలితాల్లో మంచి ప్రదర్శన కనబరిచింది.దేశవ్యాప్తంగా అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్నప్పటికీ మెరుగైన ఫలితాలను సాధించి ఆశ్చర్యానికి గురిచేసింది. 2018-19 మూడో త్రైమాసిక ఫలితాలను మంగళవారం ప్రకటించింది.
దాదాపు రెండు మూడు క్వార్టర్ల తరువాత పీఎన్బీ ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించడంతో ఈ కౌంటర్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో జోరందుకుంది. 4 శాతం జంప్ చేసింది.ఈ ఏడాది క్యూ3 (అక్టోబర్-డిసెంబర్)లో పీఎన్బీ 7 .12 శాతం వృద్ధితో రూ. 246.5 కోట్ల నికర లాభం ఆర్జించింది.
నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) సైతం 7.6 శాతం పెరిగి రూ. 4290 కోట్లను తాకింది. రూ. 2754 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. గతేడాది(2017-18) క్యూ3లో ఇవి రూ. 4467 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీ ఏలు) 17.16 శాతం నుంచి 16.33 శాతానికి మెరుగుపడ్డాయి. నికర ఎన్పీఏలు సైతం 8.9 శాతం నుంచి 8.22 శాతానికి తగ్గాయి.